Uttarakhand Tunnel Collapse | న్యూఢిల్లీ: నిరీక్షణకు తెరపడింది. కోట్లాదిమంది భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి సురక్షితంగా బయటకు వచ్చారు. ‘ర్యాట్-హోల్ మైనింగ్’ నిపుణులు అద్భుతం సృష్టించారు. కూలిన సొరంగంలో మాన్యువల్గా తవ్వకాన్ని చేపట్టి 24 గంటల్లో 10 మీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేశారు. తవ్విన మార్గం గూండా పైపులను పంపి.. ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాలతో బయటకు వచ్చిన తమ వాళ్లను చూశాక.. కార్మిక కుటుంబాల సభ్యులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఆనందంతో అక్కడున్నవారితో స్వీట్స్ పంచుకున్నారు. సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులను చిన్యాలిసౌర్ దవాఖానకు తరలించారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అన్నది పరిశీలించాక, వారిని స్వస్థలాలకు పంపనున్నారు.
అత్యాధునిక మిషన్లు విఫలమైన చోట..
అత్యాధునిక ఆగర్లు, ఇతర మిషన్లు విఫలమైనచోట ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అద్భుతంగా పనిచేసిందని ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ సభ్యుడు హస్నానీ వెల్లడించారు. ఈ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో జార్ఖండ్ వాసులు అత్యధికంగా ఉన్నారు. 41మందిలో 15 మంది జార్ఖండ్ వాసులుకాగా, ఏడుగురు ఉత్తరప్రదేశ్, ఐదుగురు బీహార్, ఐదుగురు ఒడిశా, ముగ్గురు పశ్చిమ బెంగాల్, ముగ్గురు ఉత్తరాఖండ్, ఇద్దరు హిమాచల్ ప్రదేశ్, ఇద్దరు అస్సాం నుంచి ఉన్నారు.
ఎందుకీ టన్నెల్?
నాలుగు పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిల మధ్య రోడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో కేంద్రం ‘చార్ధామ్’ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంట్లో భాగంగానే 4.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నది. ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్గావ్లను కలిపేమార్గంలో ఇది ఉంది. నవంబర్ 12న సిల్క్యారా వైపు నుంచి 205-260 మీటర్ల సొరంగానికి చెందిన ఒక భాగం ప్రమాదవశాత్తు కూలింది. దీంతో 260 మీటర్ల మార్క్కు అవతల కార్మికులు చిక్కుకుపోయారు.
ఏమిటీ ‘ర్యాట్ హోల్ మైనింగ్’?
గనుల్లో బొగ్గును దొంగలించడానికి కొంతమంది ఈ టెక్నిక్ను ఉపయోగిస్తారు. కేవలం ఒకే ఒక్క మనిషి పట్టేంత వెడల్పుతో సొరంగాన్ని తవ్వి.. బొగ్గును దొంగలించటాన్ని ‘ర్యాట్ హోల్ మైనింగ్’గా పేర్కొంటారు. ఈ టెక్నిక్తో మైనింగ్ చేయటం చట్టవిరుద్ధం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో ఈ విధానంపై నిషేధం విధించింది.