డెహాడ్రూన్ : ఉత్తరాఖండ్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెహ్రీ, రుద్రపూర్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్బై చెప్పగా.. తెహ్రీ ఎమ్మెల్యే ధన్సింగ్ నేగి కాంగ్రెస్లో చేరారు.
రుద్రపూర్ నుంచి టికెట్ కేటాయించేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన రాజ్కుమార్ తుక్రాల్ పార్టీకి రాజీనామా చేసి, లేఖను పార్టీ అధ్యక్షుడు మదన్ కౌశిక్కు పంపారు. తనకు టికెట్ దక్కకుండా కుట్రపన్నారని ఆరోపించిన ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. రుద్రపూర్ స్థానం టికెట్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివ్ అరోరాకు ఆ పార్టీకి బుధవారం కేటాయించింది.
ఇదిలా ఉండగా.. గురువారం కాంగ్రెస్లో చేరిన ధన్సింగ్ నేగి.. తెహ్రీ అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కిశోర్ రూ.కోటితో తెహ్రీ సీటును కొనుగోలు చేశాడని ఆరోపించారు. మరో వైపు, కిశోర్ ఉపాధ్యాయ్ను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత ఆయన గురువారం బీజేపీలో చేరగా.. ఆ పార్టీ అతన్ని తెహ్రీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది.