డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ముందుకెళ్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో గత నెల 14న ఒకే విడుతల ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా.. బీజేపీ 46 స్థానాల్లో అధికంలో కొనసాగుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ 21 స్థానాలు, ఇతరులు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
అయితే, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్రావత్ లాల్ కువాల్ స్థానంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్తీ చేతిలో దాదాపు 14వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అలాగే ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దాదాపు 5వేలకుపైగా ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ గెలుపు దిశలో ముందుకెళ్తున్నారు.