న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో రిసెప్షనిస్ట్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. శుక్రవారం ప్రధాన నిందితుడు, రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇవాళ రిసార్టు మేనేజర్ సౌరభ్ భాస్కర్ను, రిసార్టు అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను అరెస్ట్ చేశారు. రిసార్టులో రిసెప్షనిస్ట్ గా పనిచేసే 19 ఏండ్ల యువతిని ఆ రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య.. రిసార్టు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్తో కలిసి హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య రాష్ట్రంలోని సీనియర్ బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు. వినోద్ ఆర్య గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రిసెప్షనిస్ట్ హత్య కేసులో అతని కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉండటంతో అధికార బీజేపీ వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగించింది. పార్టీ సభ్యుడిగా ఉన్న పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను కూడా బీజేపీ బయటికి పంపింది.
కాగా, ఈ కేసులో నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. సెప్టెంబర్ 18న యువతి హత్యకు గురైతే సెప్టెంబర్ 21న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించింది.