డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్రకు రోజువారీ పరిమితిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 3 నుంచి ప్రారంభంకానున్న చార్ ధామ్ యాత్రకు సంబంధించిన వివరాలను ఆదివారం ప్రకటించింది. బద్రీనాథ్కు రోజువారీ యాత్రికుల పరిమితి 15,000గా నిర్ణయించారు. అలాగే కేదార్నాథ్కు 12,000 మందికే పరిమితం చేశారు. గంగోత్రి, యమునోత్రికి రోజువారీ యాత్రికుల పరిమితులను 7,000, 4,000గా పేర్కొన్నారు. చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో 45 రోజుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
కాగా, మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరుస్తారు. మే 6న కేదార్నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో సంబంధిత ఆంక్షలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సడలించింది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని శనివారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది హిమాలయ ఆలయాలను సందర్శించే యాత్రికులు రికార్డు స్థాయిలో రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.
మరోవైపు మే 3 నుంచి 31 వరకు యమునోత్రికి 15,829 మంది, గంగోత్రికి 16,804 మంది, కేదార్నాథ్కు 41,107 మంది, బద్రీనాథ్కు 29,488 మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పర్యాటక శాఖ కార్యదర్శి దిలీప్ జవాల్కర్ తెలిపారు. చార్ ధామ్ యాత్ర కోసం విధిగా రాష్ట్ర పర్యాటక శాఖలో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.