Poling Time Extension | వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరాఖండ్లో గంట సేపు పోలింగ్ సమయం పొడిగిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారిందని శుక్రవారం చెప్పారు. అందుకే తొలిసారి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
దీని ప్రకారం వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాగుతుంది. ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేయడానికి సుశీల్ చంద్రతోపాటు ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే కూడా ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో 601 గ్రౌండ్స్, 277 భవనాలు గుర్తించామని సుశీల్ చంద్ర చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ సభలు జరుపుకోవచ్చునన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ గ్రౌండ్స్ లేదా భవనాలను బుక్ చేసుకునేందుకు అవసరమైన విధి విధానాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తామని సుశీల్ చంద్ర అన్నారు. తొలుత బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రౌండ్స్, భవనాలు కేటాయిస్తారని తెలిపారు.