Uttarakhand New CM | ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్ర నూతన సీఎంగా మహిళను నియమించాలని యోచిస్తున్నదా..? పార్టీ వర్గాలు కూడా మహిళా నేతకు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ నూతన సీఎంగా మహిళను బీజేపీ ఎంపిక చేస్తే ఉత్తరాఖండ్ రాజకీయాల్లో రికార్డు కానున్నది. 70 స్థానాల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. కానీ సీఎం పుష్కర్ సింగ్ ధామీ… ఖాతిమా స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న విషయమై చర్చ వాడివేడిగా జరుగుతున్నది. పుష్కర్ ధామీ ఓటమి పాలైనా, మరోమారు ఆయననే సీఎంగా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ధామీని సీఎంగా నియమిస్తే కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయన కోసం రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని వార్తలొచ్చాయి.
కొత్త ముఖాన్ని రంగంలోకి తెచ్చేందుకు బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఆ పరిస్థితి వస్తే మాజీ సీఎం బీసీ ఖండూరీ (భువన్ చంద్ర ఖండూరీ) తనయ రితూ ఖండూరీ భూషణ్ పేరు కూడా ప్రస్తావనకు వస్తున్నది. కొట్ద్వార్ స్థానం నుంచి తొలిసారి ఎన్నికైన మహిళా నాయకురాలు ఆమె. 2012లో బీసీ ఖండూరీ ఓటమి పాలవ్వడంతోపాటు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ దఫా ఎన్నికల్లో కొట్ద్వార్ స్థానం నుంచి ఖండూరీ తనయ రితూ ఖండూరీ భూషణ్ ఎన్నికయ్యారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రితూ ఖండూరీ.. పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు విందునిచ్చారు. ఈ సందర్భంగా మహిళామోర్చా కార్యకర్తలు రితూ ఖండూరీని సీఎం చేయాలని ఇమాండ్ చేశారు. కానీ, తాను సీఎం రేసులో లేనని రితూ ఖండూరీ సమాధానమిచ్చారు. దీనిపై పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామన్నారు.
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో ఇప్పటివరకు నెలకొన్న సంప్రదాయానికి రాష్ట్ర ప్రజలు తెరదించారు. ఇందులో మహిళలు పెద్ద పాత్ర పోషించారు. ప్రజాస్వామ్య పండుగలో మహిళలు భాగస్వాములైనందుకు రితూ ఖండూరీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విజయం అంటే మహిళల విజయమేనని చెప్పారు. ఫుష్కర్ సింగ్ ధామీ పేరుతోపాటు మాజీ సీఎం రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర మంత్రి అజయ్భట్, రాష్ట్ర మంత్రులు సత్పాల్ మహారాజ్, డాక్టర్ ధన్సింగ్ రావత్, బిషణ్ సింగ్ చుఫాల్, బంషిధర్ భగత్ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి.