డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాధోడ్పై బేగంపురకు చెందిన పార్టీ మహిళా కార్యకర్త ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల ప్రకారం జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాధోడ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని హరిద్వార్ ఎస్పీ కృష్ణరాజ్ పేర్కొన్నారు. కొద్ది నెలల కిందట ఎమ్మెల్యే రాధోడ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఎమ్మెల్యే తనను బెదిరించడంతో తాను వెల్లడించలేదని ఆమె తెలిపారు.
రాధోడ్తో తనకు రెండున్నరేండ్ల నుంచి పరిచయం ఉందని తనను మహిళా మోర్చాలో చేరాలని ఆయన కోరారని చెప్పారు. కాగా, తనపై నకిలీ లైంగిక దాడి కేసు మోపారని రాధోడ్ బాధిత మహిళ ఆరోపణలను తోసిపుచ్చారు. తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందని తనకు భద్రత కల్పించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దోపిడీ కేసులో జైలుకు వెళ్లిన వారు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని తప్పుడు కేసు బనాయించారని ఎమ్మెల్యే రాధోడ్ ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు.