లక్నో: ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఏడాదికి కోటికిపైగా సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. రూ.24 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. యూట్యూబర్ (YouTuber) తస్లీం చాలా ఏళ్లుగా ‘ట్రేడింగ్ హబ్ 3.0’ పేరులో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. స్టాక్మార్కెట్ సమాచారానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. తద్వారా రూ.1.2 కోట్ల ఆదాయం గడించాడు.
కాగా, ఈ విషయం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తస్లీం ఇంటిపై వారు రైడ్ చేశారు. ఇంట్లో తనిఖీలు చేసి రూ.24 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తస్లీం యూట్యూబ్ ద్వారా సంపాదించిన ఆదాయం గురించి దర్యాప్తు చేస్తున్నారు. అతడు అక్రమ పద్ధతుల్లో డబ్బులు సంపాదిస్తున్నట్లు ఐటీ అధికారులు ఆరోపించారు.
మరోవైపు ఐటీ అధికారుల ఆరోపణలను తస్లీం కుటుంబ సభ్యులు ఖండించారు. యూట్యూబ్ ద్వారా సంపాదించిన రూ.1.2 కోట్ల ఆదాయానికి సంబంధించి రూ.4 లక్షలు ట్యాక్స్గా చెల్లించినట్లు తస్లీం సోదరుడు ఫిరోజ్ తెలిపాడు. తాము యూట్యూబ్ ఛానెల్ మాత్రమే నిర్వహిస్తున్నామని, ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. ఐటీ దాడి చాలా ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ఆరోపించాడు. తన కుమారుడ్ని తప్పుడు కేసులో ఇరికించారని తస్లీం తల్లి వాపోయింది.