లక్నో: ఒక పిల్లల పార్క్లో ఊయల వంటి ఆట వస్తువులకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) రంగులు వేయడం వివాదస్పదమైంది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ కలెక్టరేట్కు సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే నిరాలా ఉద్యాన పార్క్ ఉన్నది. ఇందులోని పిల్లల ఊయల, ఇతర ఆట సామగ్రి, గ్రిల్స్కు సమాజ్వాదీ పార్టీ జెండాను పోలిన ఎరుపు, ఆకుపచ్చ రంగులు వేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ముందు మార్చి 5న ఇది జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
దీంతో యూపీలోని అధికార బీజేపీ ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో మార్చి 6న స్వల్పంగా మార్పులు చేశారు. ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్యలో పసుపు రంగు వేశారు. గతంలో ఉన్న రంగులు వెలిసిపోవడంతో వాటి స్థానంలోనే రెడ్, గ్రీన్ కలర్స్ వేసినట్లు జిల్లా ఉద్యానవన అధికారి సునీల్ కుమార్ తెలిపారు.
మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పార్క్కు ఎస్పీ జెండాను పోలిన ఎరుపు, ఆకుపచ్చ రంగులు వేయించిన జిల్లా ఉద్యానవన అధికారి సునీల్ కుమార్పై చర్యలకు జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. దీంతో అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్. రామి రెడ్డి ఆయనను సస్పెండ్ చేశారు. సునీల్ కుమార్ను లక్నో ప్రధాన కార్యాలయానికి ఎటాచ్ చేశారు.