లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్పీ ఎంపీ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించింది. దీంతో పోలీసులకు లొంగిపోయిన ఆయన నాటి నుంచి జైలులో ఉన్నారు. తాజాగా కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే తనకు న్యాయం జరుగదని ఆరోపించిన ఆ మహిళ తన స్నేహితుడితో కలిసి గత ఏడాది సుప్రీంకోర్టు వద్ద నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
2019 లోక్సభ ఎన్నికల్లో ఘోసి స్థానం నుంచి బీఎస్పీ తరుఫున పోటీ చేసిన అతుల్ రాయ్ ఎంపీగా గెలిచాడు. అయితే వారణాసికి చెందిన 24 ఏళ్ల మహిళ ఆయనపై ఆరోపణలు చేసింది. 2018లో వారణాసిలోని ఆయన ఇంట్లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2019 మేలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతుల్ రాయ్ ఆ ఏడాది జూన్లో పోలీసులకు లొంగిపోయాడు. నాటి నుంచి జైలులో ఉన్నాడు.
కాగా, 2020 నవంబర్లో అతుల్ రాయ్ సోదరుడు ఆ మహిళపై ఫోర్జరీ కేసు పెట్టాడు. అయితే జైలులో ఉండటంతో ఎంపీగా ప్రమాణం చేయని అతుల్ రాయ్కు పెరోల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అల్హాబాద్ హైకోర్టు అతుల్కు రెండు రోజులు పెరోల్ ఇవ్వడంతో ఎంపీగా ఆయన ప్రమాణం చేశారు.
మరోవైపు అతుల్ రాయ్పై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళ గత ఏడాది ఆగస్ట్లో తన స్నేహితుడితో కలిసి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడింది. ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులతో వారణాసి పోలీసులు కుమ్మక్కై తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించింది. దీంతో తన కేసులో న్యాయం జరుగదని వాపోయింది. అనంతరం వారిద్దరూ కలిసి సుప్రీంకోర్టు వెలుపల పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నారు. తీవ్ర కాలిన గాయాలతో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
కాగా, ఇది జరిగి ఏడాదైన తర్వాత వారణాసి కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. ఆ మహిళపై లైంగిక దాడి కేసులో ఎంపీ అతుల్ రాయ్ నిర్దోషి అని పేర్కొంది. అయితే ఆ మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించడంతోపాటు మరి కొన్ని పెండింగ్ కేసులు ఆయనపై ఉన్నాయి. దీంతో అతుల్ రాయ్ను జైలు నుంచి విడుదల చేయరని తెలుస్తున్నది.