లక్నో: అదనపు కట్నంగా స్కార్పియో కారు (Scorpio Car) ఇవ్వలేదని కట్టుకున్న భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 2015లో ముస్లిం కట్టుబాట్ల ప్రకారం తమకు వివాహమైందని, ఆ సమయంలో కట్నంగా రూ.15 లక్షలు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే వివాహం అయిన తర్వాత అదనపు కట్నం కోసం తన భర్తతోపాటు, అత్తింటివారి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపింది. అతని డిమాండ్లు తీరకపోవడంతో మానసికంగా, శారీరకంగా వేధించారని వెల్లడించింది. రెండో పెండ్లి చేసుకుంటానని బెదిరించాడని పేర్కొంది. గతేడాది జూలైలో తనను ఇంటిని వెళ్లగొట్టారని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నానని అందులో తెలిపింది.
అయితే ఈ మధ్య తన భర్త తమ ఇంటికి వచ్చాడని, కట్నం కింద స్కార్పియో కారు ఇవ్వాలని డిమాండ్ చేశాడని వెల్లడించింది. అయితే దానిని తన తండ్రి విరస్కరించారని, దీంతో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని తెలిపింది. అదనపు కట్నం కోసం తనను వేధించాడని, ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.