Goa | తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నానని ఉత్పల్ పర్రీకర్ ప్రకటించారు. అయితే బీజేపీ పణాజి నుంచి ఓ మంచి అభ్యర్థికి గనక అవకాశమిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ తన గుండెలో ఎప్పటికీ ఉంటుందని, పార్టీ సిద్ధాంతం కోసమే నిరంతరం తపిస్తూ వుంటానన్నారు. ‘పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. అత్యంత క్లిష్టమైన నిర్ణయమది.కానీ కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. తప్పదు మరి. పణాజి నుంచి ఓ మంచి అభ్యర్థిని రంగంలోకి దింపితే మాత్రం పోటీ నుంచి తప్పుకోవడానికి రెడీగానే వున్నాను’ అని ఉత్పల్ పర్రీకర్ ప్రకటించారు.
బీజేపీకి ఉత్పల్ పర్రీకర్ రాజీనామా చేశారు. పణాజి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. పార్టీని ఒప్పించడానికి శతధా ప్రయత్నాలు చేశానని, అయినా పణాజి విషయంలో పార్టీని ఒప్పించుకోలేకపోయానని పేర్కొన్నారు. రాజకీయ అవకాశం కోసం పార్టీలో చేరిన వారికి టిక్కెట్ ఇచ్చారని, తన రాజకీయ భవిష్యత్తును పణాజి ప్రజలే నిర్ణయిస్తారని ఉత్పల్ పేర్కొన్నారు.