డెహ్రాడూన్: ఒక వ్యాపారిని పాముతో కాటేయించి చంపారు (Businessman Killed Using Cobra). దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అతడి ప్రియురాలు, పాములు పట్టే వ్యక్తి, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 14న తీన్పానీ ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో 30 ఏళ్ల వ్యాపారవేత్త అంకిత్ చౌహాన్ అనుమానాస్పదంగా మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడి మృతిపై దర్యాప్తు చేపట్టారు. తొలుత కారు నుంచి వెలువడిన విషవాయువుల వల్ల అతడు చనిపోయినట్లు భావించారు. అయితే పాము కాటేయడంతో విషం వల్ల ఆ వ్యాపారి మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది.
కాగా, మృతుడు అంకిత్ చౌహాన్ ఫోన్ కాల్స్ వివరాలను పోలీసులు పరిశీలించారు. మహి అలియాస్ డాలీ ఆర్య అనే మహిళతో అతడికి సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నెల 14న ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత అతడు మరణించినట్లు గ్రహించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఫోన్ కాల్స్పై దృష్టిసారించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పాములు పట్టే రమేష్ నాథ్ను ఆమె సంప్రదించినట్లు తెలుసుకుని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు రమేష్ను పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి అంకిత్ చౌహాన్ను ఎలా చంపారో అన్నది బయటపెట్టాడు. మహి, ఆమె ప్రియుడు దీప్ కంద్పాల్, ఆమె ఇద్దరు సహాయకులు కలిసి ఈ కుట్ర పన్నినట్లు తెలిపాడు. అంకిత్తో మద్యం తాగించారని, అతడు మత్తులో ఉండగా తన సహాయంతో నాగు పాముతో కాటు వేయించినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో వ్యాపారి అంకిత్ చౌహాన్ ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పాములు పట్టే రమేష్, మృతుడి ప్రియురాలు మహి, ఆమె ప్రియుడు, ఇద్దరు సహాయకులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.