న్యూఢిల్లీ: విడాకులపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. విడాకులు(Divorce) కోరుకునే జంట ఆర్నెళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు.. ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని.. దంపతులకు విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది. దంపతులు ఇద్దరూ విడాకులకు అంగీకరిస్తే, హిందూ వివాహ చట్టం ప్రకారం ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదని కోర్టు వెల్లడించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది.
ప్రాథమిక హక్కులతో లింకున్న ఆర్టికల్ 142ని పరిగణలోకి తీసుకుని, కోర్టు తన అధికారాలతో న్యాయం చేస్తుందని సుప్రీం బెంచ్ తెలిపింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బీ ప్రకారం.. విడాకులు కావాలనుకునే జంట కచ్చితంగా ఆర్నెళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. అయితే విడాకులు ఆశించే జంటలను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సి అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో కోర్టు ఈ అదేశాలు ఇచ్చింది.
ఆర్టిక్ 142 ప్రకారం సుప్రీంకోర్టు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది. అయితే సంపూర్ణ న్యాయం చేసేందుకు తాము ఆ అధికారాలు వినియోగించే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఆర్టికల్ 142 ప్రకారం వైవాహిక బంధాన్ని రద్దు చేసేందుకు సుప్రీంకోర్టుకు అధికారం ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో ఓ కేసును 2016, జూన్ 29వ తేదీన అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ శివ కీర్తి సింగ్, ఆర్ భానుమతిలతో కూడిన బెంచ్ ఆ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేసింది.
ఆ కేసులో విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం.. 2022, సెప్టెంబర్ 29వ తేదీన తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్లు ఇందిరా జైసింగ్, వీ గిరి, కపిల్ సిబల్, దుశ్యంత్ దావే, మీనాక్షీ ఆరోరాలను న్యాయ సలహాదారులుగా నియమించారు. సీనియర్ అడ్వకేట్లు వీ మోహన, జయ సాల్వే, అడ్వకేట్ అమోల్ చితలే కూడా ఈ కేసులో వాదించారు.