న్యూఢిల్లీ : బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుగాడే నలుగురు అమెరికన్ మహిళా దౌత్యవేత్తలు బుధవారం అధికారిక వాహనాలను విడిచి ఢిల్లీ వీధుల్లో ఆటో తోలుతూ తమ పనులను చక్కబెట్టుకున్నారు. అన్ మాసన్, రూథ్ హోంబెర్గ్, షరీన్, జెన్నిఫర్ బ్లాక్, పింక్ ఆటోల్లో తమ పనులతో పాటు అధికారిక పర్యటనలను చేపట్టారు. దౌత్యవేత్త మాసన్ బ్లూటూత్ డివైజ్, పులి బొమ్మతో కూడిన కర్టెన్ కలిగిన బ్లాక్ ఆటోలో ప్రయాణించారు.
U.S. diplomats in New Delhi drive tuk tuks instead of cars, say it's liberating to get around in a three-wheeler pic.twitter.com/4MWJWpAmGK
— Reuters (@Reuters) November 24, 2022
తాను భారత్కు వచ్చే ముందు పాకిస్తాన్లో సాయుధ భద్రతతో కూడిన వాహనాల్లో ప్రయాణించానని, అవి భారీగా ఆకట్టుకునేలా ఉండేవని గుర్తు చేసుకున్నారు. తనకు మాత్రం వీధుల్లో తిరుగాడే వాహనాల్లో ప్రయాణించాలని ఉండేదని, ఆటోల్లో తిరగడం అంటే ఇష్టమని మాసన్ చెప్పుకొచ్చారు. ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోరాదనే స్ఫూర్తిని తల్లి నుంచి అందిపుచ్చుకున్నానని అన్నారు. తన తల్లి ప్రపంచమంతా చుట్టేసిందని, వియత్నాం యుద్ధం సహా తన జీవితంలో ఎన్నో చూసిందని చెప్పారు.
నీకు ఆసక్తికరమనిపించే పనులు చేసే అవకాశం ఉంటే ప్రయత్నించాలని ఆమె తనతో చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. ఇక మరో దౌత్యవేత్త షరీన్ ఫ్లవర్ మాగ్నెట్స్తో కూడిన పింక్ ఆటో రిక్షా సొంతంగా సమకూర్చుకున్నారు. సొంత ఆటో కలిగిన మెక్సికన్ రాయబారి తనకు ఇన్స్పిరేషన్ అని షరీన్ అన్నారు. దౌత్యమంటే ప్రజలను కలుసుకోవడం, ఒకరినొకరు తెలుసుకోవడం, సంబంధాలను పెంచుకోవడమేనని వాటిని ఆటో ద్వారా తాను చక్కదిద్దుకుంటున్నానని మరో దౌత్యవేత్త రూథ్ హాంబర్గ్ చెప్పారు.