న్యూయార్క్ : భారత్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ(Nikki Haley) పేర్కొన్నారు. ఇండియాను స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య భాగస్వామిగా భావించాలని ఆమె అన్నారు. న్యూస్వీక్ మ్యాగ్జిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో నిక్కీ హేలీ వ్యాఖ్యలకు ప్రాధానత్య సంతరించుకున్నది.
విదేశాంగ విధానంలో ట్రంప్ సర్కారు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. చైనాను అధిగమించే ఉద్దేశంలో.. భారత్తో వాణిజ్య రిలేషన్ను దెబ్బతీసుకోవద్దు అని ఆమె సూచించారు. రష్యా నుంచి ఇంధనం ఎగుమతి చేసుకుంటుందన్న ఆరోపణపై భారత్పై అదనపు సుంకాలు విధించేందుకు ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్తో వాణిజ్య బంధానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆ దేశంతో సంబంధాలను పెంచుకోవాలని ఆమె తెలిపారు.
ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని ఢీకొడుతున్న భారత్పై ఆంక్షలు విధించడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని ఆమె అన్నారు. చైనాతో వాణిజ్య బంధాన్ని తెంపుకున్న సమయంలో.. అమెరికాకు ఇండియా కీలకం అవుతుందని హేలీ పేర్కొన్నారు.