న్యూఢిల్లీ: భారత్లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) దుర్గా మాతా పూజా మండపాన్ని సందర్శించారు. దేవతా విగ్రహానికి హారతి ఇవ్వడంతోపాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో సందడిగా గడిపారు. ఢిల్లీలోని సీఆర్ పార్క్లో ఏర్పాటు చేసిన దుర్గా పూజ పండాల్కు వెళ్లిన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టిని గౌరవ మర్యాదలతో నిర్వాహకులు ఆహ్వానించారు. ఆయనకు హారతి ఇచ్చి, నుదుడిపై తిలకం దిద్ది సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
కాగా, మండపంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి విగ్రహానికి ఎరిక్ గార్సెట్టి పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి వారితో కలిసి నోటితో దీపం పట్టుకుని డ్యాన్స్ చేశారు. పిల్లల డ్యాన్స్ ప్రదర్శనను చూసి వారిని అభినందించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన పలు ఫుడ్ స్టాల్స్ను కూడా ఎరిక్ గార్సెట్టి సందర్శించారు. బిర్యానీతోపాటు పలు రకాల స్వీట్లు రుచి చూశారు. అక్కడున్న పలువురితో సెల్ఫీలు దిగారు.
మరోవైపు పండాల్లో సందడికి సంబంధించిన వీడియో క్లిప్ను ఎక్స్లో ఎరిక్ పోస్ట్ చేశారు. భారత్కు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యానికి విస్మయం చెందినట్లు పేర్కొన్నారు. ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అంటూ ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దీనికి ముందు ఎరిక్ గార్సెట్టి గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. తొలిసారి ఢిల్లీ మెట్రోలో రైడ్ చేసినట్లు ఎక్స్లో పేర్కొన్నారు. అలాగే తోటి ప్రయాణికులను కలవడం చాలా ఆనందంగా ఉందని ఆ పోస్ట్లో తెలిపారు.
Shubho Pujo, everyone!
I had an incredible time pandal hopping in CR Park in Delhi, participating in the cultural festivities and of course, tasting some amazing Pujo food! As I continue to experience different celebrations across India, I remain in awe of @IncredibleIndia’s… pic.twitter.com/UHUF9qUy0v— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) October 21, 2023