న్యూఢిల్లీ: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. ( Illegal Indian Immigrants Into US ) గత ఐదేళ్లలో రెండు లక్షల మందికిపైగా భారతీయ అక్రమ వలసదారులను అమెరికా ఎదుర్కొన్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పార్లమెంటుకు తెలిపింది. 2022-23లో అత్యధికంగా 96,917 కేసులు నమోదయ్యాయని చెప్పింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అందజేసిన గణాంకాలను వెల్లడించింది. 2018-19లో 8,027 మంది, 2019-20లో 1,227 మంది, 2020-21లో 30,662 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా అధికారులు గుర్తించినట్లు కేంద్ర మంత్రి మురళీధరన్ తెలిపారు. 2021-22లో ఈ సంఖ్య 63,927కు, 2022-23లో 96,917కు పెరిగిందని చెప్పారు. గత ఐదేళ్లలో అమెరికా అధికారులు ఎదుర్కొన్న భారతీయ అక్రమ వలసదారుల సంఖ్య మొత్తం 2,00,760కు చేరిందన్నారు.
కాగా, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ వెబ్సైట్లో ప్రచురించిన ఇమ్మిగ్రేషన్ గణాంకాల ఆధారంగా ఈ వివరాలు ఉన్నాయని కేంద్ర మంత్రి మురళీధరన్ పార్లమెంటుకు తెలిపారు. అయితే అమెరికా సరిహద్దు దాటుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్యకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని చెప్పారు. విదేశాల్లోని భారత పౌరుల భద్రత, శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. చట్టపరమైన వలసలు, విదేశీ ఉద్యోగాలు ఆశించేవారు మోసపోకుండా ఉండేందుకు విదేశాంగ శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.