న్యూఢిల్లీ: అపార్థం చేసుకునే అవకాశం ఉన్న లేదా స్వీయ ప్రచారంగా కనిపించే సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని, తమ విజయాలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యూపీఎస్సీ సోమవారం సూచించింది. ఇలాంటి సలహాలు ప్రతి సంవత్సరం అభ్యర్థులకు సిఫార్సు చేయడం సాధారణమే అయినప్పటికీ ఈ ఏడాది ఈ సూచనలు సుదీర్ఘంగా ఉండడం ప్రత్యేకమని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాను వివేచనతో ఉపయోగించాలని కోరిన యూపీఎస్సీ అభ్యర్థులు వాణిజ్య లేదా సంస్థాగత ప్రచారాల్లో పాల్గొనవద్దని సలహా ఇచ్చింది.