లక్నో: ప్రియుడి అప్పులు తీర్చేందుకు (Pay Off Lover’s Debts) అతడితో కలిసి ఒక మహిళ ప్లాన్ వేసింది. సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర వస్తువులు దోచుకున్నారని ఆమె ఆరోపించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యాపారవేత్త భార్యకు పుష్పేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా అతడు అప్పులపాలయ్యాడు.
కాగా, ప్రియుడి అప్పుల సమస్యలు తీర్చేందుకు ఆ మహిళ ఒక ప్లాన్ వేసింది. భర్త, పిల్లలు ఇంట్లో లేనప్పుడు పుష్పేంద్ర ఆమె ఇంటికి వెళ్లాడు. కట్టర్ ద్వారా బీరువాను కట్ చేశాడు. అందులో ఉన్న రూ.1.5 లక్షల డబ్బు, బంగారు నగలు, ఇంట్లోని ఎల్ఈడీ టీవీ, మొబైల్ ఫోన్ ఎత్తుకుపోయాడు.
మరోవైపు దొంగలు తన చేతిపై సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది. అనంతరం ఇంట్లోని డబ్బు, నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ప్రియుడు పుష్పేంద్ర అప్పులు తీర్చేందుకు అతడితో కలిసి ఆమె ఈ నాటకం ఆడినట్లు తెలుసుకున్నారు.
కాగా, ఆ మహిళ స్వయంగా తన చేతిపై సిగరెట్తో వాతలు పెట్టుకున్నదని పోలీసులు తెలిపారు. ఆమెపై లైంగిక దాడి జరుగలేదన్నది వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఆమె ప్రియుడు పుష్పేంద్రను అదుపులోకి తీసుకుని డబ్బులు, నగలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులను తప్పుదారి పట్టించిన వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.