పట్నా: బీహార్లో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. మంగళవారం రాత్రి బీహార్లోని సరాన్ జిల్లా చాప్రా ఏరియాలో కల్తీ మద్యం సేవించి పలువురు ఆస్పత్రి పాలయ్యారు. బుధవారం ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ఇవాళ మధ్యాహ్నానికి ఆ కల్తీ మద్యం మరణాల సంఖ్య 60కి చేరింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
బీహార్లో 2016, ఏప్రిల్ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దాంతో మద్యానికి అలవాటు పడిన కొందరు దొంగచాటుగా లభ్యమయ్యే కల్తీ మద్యాన్ని సేవిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 2016 నుంచి బీహార్లోని ఎక్కడో ఒకచోట తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
అయితే, తాజా మరణాలపై రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. కల్తీ మద్యం చావులకు ముఖ్యమంత్రి నితీశ్కుమారే కారణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ నితీశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ మరణాలపై సీఎం నితీశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ తాగితే చస్తారు అని వ్యాఖ్యానించడం కూడా తీవ్ర దుమారం రేపుతున్నది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని బీహార్ బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ మండిపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తున్న నితీశ్ కుమార్ కల్తీ మద్యాన్ని నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కల్తీ మద్యం కాటుకు గడిచిన ఆరేండ్లలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.