లక్నో: ఒక టీచర్ రెండేళ్లుగా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే శ్రద్ధా వాకర్ గతే ఆమెకు పడుతుందని హెచ్చరించాడు. ఆఫ్తాబ్ మాదిరిగా ఆమెను ముక్కలుగా నరుకుతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల కంప్యూటర్ టీచర్ సౌరభ్ గుప్తా, రెండేళ్ల కిందట మార్కుల పేరుతో 9వ తరగతి విద్యార్థిని లోబరచుకున్నాడు. ఆమె ఎదురుతిరిగినప్పుడల్లా ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఆ బాలికపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే శ్రద్ధాను ఆఫ్తాబ్ హత్య చేసిన మాదిరిగా ముక్కలుగా నరికి చంపుతానని హెచ్చరించాడు.
కాగా, కీచక టీచర్ వార్నింగ్తో ఆ బాలిక భయపడింది. లైంగిక దాడితోపాటు అతడి బెదిరింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీచర్ సౌరభ్ గుప్తాపై పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా సూరజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైత్పూర్ గ్రామంలో ఇంట్లో ఉన్న అతడ్ని ఆదివారం అరెస్ట్ చేశారు.
మరోవైపు ఫెయిల్ చేస్తానని బెదిరించి పలువురు విద్యార్థినులను కూడా లొంగదీసుకున్నట్లు ఆ టీచర్ దర్యాప్తులో తెలిపాడు. ఈ నేపథ్యంలో సోమవారం నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.