లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై వేడి అన్నాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 29న ఇచ్చోలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అయితే ఒడ్డిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్, రెండో తరగతి చదవుతున్న దళిత బాలికపైకి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆ బాలిక చేయి, మోచేతికి కాలిన గాయాలయ్యాయి.
కాగా, సెప్టెంబర్ 3న జరిగిన తాసిల్ దివస్లో ఆ బాలిక తల్లి దీనిపై అధికారులకు చెప్పింది. స్కూల్ ప్రిన్సిపల్ తన కుమార్తెపైకి వేడి అన్నం విసరడంతో ఆమె చేతికి కాలిన గాయాలయ్యాయంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
మరోవైపు ఆ బాలిక దివ్యాంగురాలని జిల్లా ఎస్పీ తెలిపారు. విద్యాశాఖ అధికారి నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.