లక్నో: విద్యార్థులతో ప్లేట్లు కడిగించిన కుకింగ్ సిబ్బందిని అధికారులు డిస్మిస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ పిల్లల పట్ల వివక్ష చూపడంపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దౌదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులు భోజనం చేసిన తర్వాత వారి ప్లేట్లను వంట సిబ్బంది కడుగాలి. అయితే ఆ సిబ్బంది దీనిని పాటించడం లేదు. విద్యార్థులతోనే ప్లేట్లు, పాత్రలు కడిగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ ప్లేట్లను వేరుగా కడిగేలా చేస్తున్నారు.
గ్రామ సర్పంచ్ మంజు దేవి దృష్టికి ఈ విషయం వెళ్లింది. దీంతో ఆమె ఆ స్కూల్కు వెళ్లి ప్రధాన ఉపాధ్యాయురాలు గరిమా రాజ్పుత్ను నిలదీశారు. మరోసారి ఇలా జరుగకుండా చూడాలని హెచ్చరించారు. అయితే హెడ్మాస్టార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో అధికారి కూడా ఆమెతో దీని గురించి మాట్లాడగా, ఈ స్కూల్లో ఇలాగే జరుగుతుందని హెడ్మాస్టార్ భర్త సమాధానం ఇచ్చాడు.
మరోవైపు విద్యార్థులతో ప్లేట్లు, పాత్రలు కడిగిస్తుండటంపై బ్లాక్ విద్యా అధికారితో స్కూల్ ప్రతినిధి సహబ్ సింగ్ మాట్లాడారు. అయితే అలాంటి నిబంధన ఏదీ లేదన్న ఆ అధికారి దీనిపై దర్యాప్తు జరిపారు. కాగా, దర్యాప్తులో విద్యార్థుల ప్లేట్లను తాము కడుగమని వంట సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా కూడా రాసి ఇచ్చారు.
దీంతో జిల్లా కలెక్టర్ మహేంద్ర బహదూర్ సింగ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు వంట సిబ్బందిని డిస్మిస్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధాన ఉపాధ్యాయురాలిని కూడా ఆ స్కూల్ నుంచి తొలగించారు.