CJI Chandrachud | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో సామాన్యులకే కాదు న్యాయమూర్తులకూ లైంగిక వేధింపులు తప్పడం లేదు. సీనియర్ న్యాయమూర్తి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యూపీకి చెందిన ఓ మహిళా జడ్జి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. తనను ఓ పురుగులా చూస్తున్నారని, ఫిర్యాదుచేసినా పట్టించుకోవట్లేదని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ చంద్రచూడ్.. తక్షణమే నివేదిక అందజేయాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను శుక్రవారం ఆదేశించారు.
పని ప్రదేశంలో ఎదురవుతున్న లైంగిక వేధింపులు, అవమానకర పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడతా.. అంటూ ఉత్తరప్రదేశ్ బాందా జిల్లా జడ్జి అర్పితా సాహూ సీజేఐకి లేఖ రాశారు. బారాబంకి జిల్లా కోర్టులో పనిచేస్తుండగా జిల్లా జడ్జి, అతడి అనుచరుల నుంచి లైంగిక వేధింపులు, అవమానాలు, మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొన్నానని సీజేఐకి రాసిన రెండు పేజీల లేఖలో ఆరోపించారు. అందులోని వివరాల ప్రకారం, ‘సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన నేను.. ఇప్పుడు అదే న్యాయం కోసం వేరొకరి తలుపు తట్టాల్సి వస్తున్నది. గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
రాత్రి పూట జిల్లా న్యాయమూర్తి ఒంటరిగా కలవమంటున్నారు’ అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ‘దీని గురించి ఈ ఏడాది జూలైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాను. కానీ, ఎలాటి ప్రయోజనం లభించలేదు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశా. కానీ సెకన్ల వ్యవధిలో నా అభ్యర్థనను కొట్టివేశారు. ఇక నేను బతికుండి ప్రయోజనం లేదు. గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఒక జిల్లా జడ్జి, అతని సహాయకులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేశాక, ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. ఇందులో సాక్ష్యులు నిందితుడైన జిల్లా జడ్జి కింద పనిచేసే ఉద్యోగులు. వీరు తమ బాస్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఎలా చెబుతారు? పారదర్శకమైన విచారణ కోసం సదరు జడ్జిని బదిలీ చేయాలని పిటిషన్ వేస్తే.. సుప్రీంకోర్టు దానిని 8 సెకన్లలో కొట్టేసింది. నా కనీస అభ్యర్థనను కూడా కోర్టు పట్టించుకోలేదు’.
– లేఖలో మహిళా జడ్జి ఆవేదన