లక్నో, ఆగస్టు 7: ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఓ మంత్రి కోర్టు నుంచి పరారయ్యారు. 1991 నాటి కేసులో ఎంఎస్ఎంఈ, ఖాదీ శాఖల మంత్రి రాకేశ్ సచన్ను శనివారం కాన్పూర్ కోర్టులో న్యాయమూర్తి దోషిగా తేల్చారు. అయితే కోర్టు తీర్పును వెలువరించడాని కంటే ముందే ఆయన అక్కడి నుంచి పారిపోయారు. మంత్రి పరారీపై కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మంత్రిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ సీనియర్ పోలీస్ అధికారి ఏపీ తివారీ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించామని వెల్లడించారు. మరోవైపు తాను పారిపోయానన్న ప్రచారం అబద్ధమని సచన్ ఆదివారం ట్వీట్ చేశారు.
మరో మంత్రిపై నాన్-బెయిలబుల్ వారెంట్
2015నాటి ఓ కేసుకు సంబంధించి యూపీ మరో మంత్రి సంజయ్ నిషద్కు స్థానిక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు, కస్టడీలో ఉన్న తమ బంధువును విడుదల చేయాలని బీజేపీ నేత దీపక్ సోన్కర్, ఆయన అనుచరులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.