మణిపురి/లక్నో, సెప్టెంబర్ 29: ఉత్తరప్రదేశ్లోని ఓ దవాఖానలో అమానుషం చోటుచేసుకుంది. జ్వరానికి చికిత్స కోసం చేరిన 17 ఏండ్ల బాలికకు డాక్టర్లు తప్పుడు చికిత్స అందించడంతో మృతి చెందింది. దీంతో భయపడ్డ డాక్టర్లు, సిబ్బంది ఆమె మృతదేహాన్ని దవాఖాన బయట పడేసి, కనీసం ఆమె కుటుంబసభ్యులకు కూడా చెప్పకుండా పరారయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో డాక్లర్ల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. యూపీ మణిపురిలోని గిరార్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకోగా, దీనికి బాధ్యులైన రాధాస్వామి దవాఖాన లైసెన్స్ను రద్దు చేసి సీల్ వేసినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై వైద్య శాఖ మంత్రి, యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ సంబంధిత దవాఖానపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.