లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలు అమలు చేయడం లేదన్న కారణంతో ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ముకుల్ గోయల్ను ఆ పోస్ట్ నుంచి తొలగించారు. సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ఆయనను బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపకపోవడం, క్రియాశీలకంగా ఉండకపోవడం వంటి కారణాలతో గోయల్ను డీజీపీ పదవి నుంచి తొలగించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.
కాగా, ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి, ముకుల్ గోయల్ 2021 జూన్ 1న డీజీపీగా నియమితులయ్యారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తానని తెలిపారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడం లేదన్న కారణాలతో డీజీపీ పోస్ట్ నుంచి ఆయనను తొలగించారు. దీనికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎన్డీఆర్పీలో ఉన్నారు. అల్మోరా, జలౌన్, మైన్పురి, హత్రాస్, అజంగఢ్, గోరఖ్పూర్, వారణాసి, సహరాన్పూర్, మీరట్ జిల్లాల్లో ఎస్పీ, ఏఎస్పీగా గతంలో పని చేశారు.