లక్నో : ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎస్ఐ ఆరోపించారు. దవాఖాన నిర్వాకంపై ఎస్ఐ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ఐ భార్యకు కొవిడ్-19 నిర్ధారణ కావడంతో ఈనెల 20న మీరట్ లోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. 22న మహమ్మారితో బాధపడుతూ దవాఖానలో మరణించారు.
ఆక్సిజన్ అందకే తన భార్య రూప్ మతి మరణించిందని ఎస్ఐ వెల్లడించారు. బాధిత ఎస్ఐని ముజఫర్ నగర్ లో పనిచేసే భిక్ చంద్ గా గుర్తించారు. తన భార్యను దవాఖానలో ఎవరూ పట్టించుకోలేదని, మందులు ఇవ్వలేదని..కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని ఆయన వాపోయారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య మరణించిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్యను ప్రభుత్వ దవాఖానే బలితీసుకుందని ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. భార్యను పొట్టనపెట్టుకున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టనని అన్నారు.