ఆగ్రా : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా పరిధిలోని ఒక గ్రామంలో అధ్వాన్నంగా తయారైన రోడ్డు విషయమై బీజేపీ ఎమ్యెల్యే ఛోటేలాల్ వర్మకు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. బుధవారం ఫతేహాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వర్మతో గ్రామస్తులు తమ గ్రామ రహదారి ఎన్నో ఏండ్లుగా అధ్వాన స్థితిలో ఉందని ఫిర్యాదు చేశారు.
దీంతో సదరు ఎమ్మెల్యే ఒక గ్రామస్తునితో ‘ఎక్కువ మాట్లాడితే, నిన్ను దారిలోకి తెచ్చేందుకు జైలుకు పంపిస్తా’ అని హెచ్చరించారు. బాధితుడు ‘ఆజ్ తక్’తో మాట్లాడుతూ తాను గ్రామ రహదారి పరిస్థితిపై ఎమ్మెల్యేకు పలుమార్లు లేఖలు రాశానని తెలిపారు. కాగా ఈ ఉదంతంపై ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాను గ్రామానికి పరామర్శకు వెళ్లానని, అయితే అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగిలపై అనుచిత పదజాలం ఉపయోగించారని ఆరోపించారు.