లక్నో: పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider) ప్రస్తుతం వార్తల్లో నానుతున్నది. ఆమె పాక్ ఏజెంట్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) రెండు రోజులుగా సీమాను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ టెక్ట్ను ఆమెతో చదివించారు. అయితే సీమా ఇంగ్లీష్ చదువడంతోపాటు, స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడటం చేసి ఏటీఎస్ పోలీసులు షాక్ అయ్యారు. అంతేగాక భారతీయులతో ముఖ్యంగా ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని వారితో పబ్జీ గేమ్ ద్వారా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు. అలాగే ఆమె బంధువు, సోదరుడు ఆర్మీలో పని చేయడంపై కూడా ఆరా తీశారు.
కాగా, పాకిస్థాన్కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్, ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనాకు 2019లో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించేందుకు గత ఏడాది ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో నేపాల్ రాజధాని ఖాట్మండులోని హోటల్లో కొన్ని రోజులు గడిపారు. మే నెలలో టూరిస్ట్ వీసా పొందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి కరాచీ నుంచి దుబాయ్ వెళ్లింది. అక్కడి నుంచి ఖాట్మండు చేరుకుంది. అక్కడ సచిన్ మీనాను కలుసుకున్నది. అనంతరం పిల్లలతోపాటు వారిద్దరూ బస్సులో సరిహద్దులు దాటి ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. నోయిడాలోని రబుపురా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలియడంతో జూలై 4న సీమా, సచిన్ను అరెస్ట్ చేశారు. అయితే 7న స్థానిక కోర్టు ద్వారా వారు బెయిల్ పొందారు. కాగా, సీమా కుటుంబ సభ్యులు పాక్ ఆర్మీలో పని చేస్తున్నారని, దీంతో ఆమె పాక్ ఏజెంట్ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీ ఏటీఎస్ పోలీసులు సీమా, సచిన్ను అదుపులోకి తీసుకున్నారు. భారత్లోకి అక్రమంగా ఆమె ప్రవేశించడంపై రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నారు.