న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకే పాఠశాలల్లోకి అనుమతిస్తామని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల వయసు మధ్య ఉన్న విద్యార్థులకు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం హర్యానా వ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. స్కూళ్లు ఓపెన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న విద్యార్థులనే తరగతులకు అనుమతించాలని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు హర్యానాలో 15 లక్షల మంది విద్యార్థులు కొవిడ్ టీకా తీసుకున్నారు.
ఇక కొవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాకు ఇద్దరు నోడల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒకరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలను మానిటరింగ్ చేస్తారని, మరొకరు ప్రయివేటు ఆస్పత్రుల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ ఇద్దరు నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఉన్న కరోనా సదుపాయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని మంత్రి అనిల్ విజ్ తెలిపారు.