న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ఆరోపించారు. అందుకే ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిర్దోషిగా నిరూపణ అయితే మళ్లీ మంత్రిగా చేయవచ్చని అన్నారు.
అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తప్పించాలని, అరెస్ట్ చేయాలన్న డిమాండ్తో సోమవారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన రైల్ రోకో విజయవంతమైందని రాకేశ్ తికాయిత్ తెలిపారు. తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని త్వరలో రూపొందిస్తామని చెప్పారు. ఈ కేసులో నిందితుడైన అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి అరెస్ట్ చేసేవరకు రైతుల ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.