భోపాల్: భారతీయ బాలికలు సరదా కోసం శృంగారంలో పాల్గొనే స్థాయికి ఎదగలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ శనివారం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే సమాజం ఉన్నదని, పెండ్లికాని ఆడపిల్లలు సంప్రదాయాలను లెక్కచేయకుండా సరదా కోసం అబ్బాయిలతో శృంగారంలో పాల్గొనే స్థాయికి భారత సమాజం చేరలేదని కోర్టు పేర్కొన్నది.
కొన్ని నెలల క్రితం పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో జూన్ 2న బాలిక అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో పోలీసులు జూన్ 4న నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న అతను బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఇవాళ ఆ పిటిషన్పై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలోని ఇండోర్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ సుబోధ్ అభ్యాంకర్ నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఆయన.. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఏ ఒక్క అంశం కూడా నిందితుడి బెయిల్ మంజూరు చేసేందుకు అర్హమైనదిగా లేదంటూ తిరస్కరించారు. ఈ సందర్భంగానే జడ్జి.. భారతీయ బాలికలు శృంగారంలో పాల్గొనరని, దానివల్ల వాళ్లు సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
పెండ్లి కాకుండానే బాలికలతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు యువకులు ఆ తర్వాత పరిణామాలను కూడా ఊహించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో బాలిక సరదా కోసం శృంగారంలో పాల్గొని ఉంటే.. ఆత్మహత్య చేసుకునేంత తీవ్ర నిర్ణయం తీసుకునేది కాదని ఆయన పేర్కొన్నారు. తమను పెండ్లి పేరుతో మోసగించారని నిరూపించడానికి బాలికలు ప్రతిసారి ఆత్మహత్యాయత్నం చేయడం తప్పనిసరి కాకూడదని హెచ్చరించారు.