నాగ్పూర్, మార్చి 21: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంగళవారం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లేదంటే మంత్రికి ప్రాణహాని తప్పదని నిందితుడు బెదిరించాడు. ఈ నేపథ్యంలో గడ్కరీ భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరం ఖమ్లా ప్రాంతంలోని మంత్రి ప్రజా సంబంధాల అధికారి ల్యాండ్లైన్ నంబర్కు మంగళవారం ఉదయం రెండు, మధ్యాహ్నం మరో ఫోన్ కాల్ వచ్చింది.
తనను తాను జయేశ్ పూజారిగా చెప్పకొన్న వ్యక్తి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా కాల్స్పై జరిపిన విచారణలో కాల్ చేసిన వ్యక్తి హిండల్గా జైలులో ఉన్న ఖైదీ అని గుర్తించినట్టు నాగ్పూర్ డీసీపీ రాహుల్ మదనే తెలిపారు. హత్య కేసులో కోర్టు అతడికి మరణశిక్ష విధించిందని, జైలు నుంచే అతడు కాల్ చేసినట్టు తేలిందని పేర్కొన్నారు. ఇదే వ్యక్తి జనవరిలో కూడా గడ్కరీకి కార్యాలయానికి ఇదే తరహాలో ఫోన్చేశాడు. గడ్కరీ నివాసానికి సైతం కాల్ వచ్చింది. తాను దావూద్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకొని రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు.