న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు (Wrestlers Protests) చేపట్టిన నిరసన నేపధ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో సమావేశమయ్యారు. సాక్షి మాలిక్, భజరంగ్ పునియా సహా పలువురు రెజ్లర్లు, రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్తో అనురాగ్ ఠాకూర్ భేటీ ముగిసింది.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను ఈనెల 30లోగా నిర్వహిస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. జూన్ 15లోగా రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని రెజ్లర్లతో భేటీ అనంతరం మంత్రి పేర్కొన్నారు.
రెజ్లర్లతో తాను ఆరు గంటల పాటు సంప్రదింపులు జరిపానని, ఈ నెల 15లోగా విచారణ ముగుస్తుందని ఈ సందర్భంగా తాను వారికి హామీ ఇచ్చానని తెలిపారు. విచారణ అనంతరం చార్జిషీట్లు దాఖలు చేస్తారని చెప్పారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు కేంద్ర మంత్రి ముందు పట్టుపట్టినట్టు సమాచారం.
Read More