ముంబై: వచ్చే ఏడాది మార్చిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. రెండు రోజుల సందర్శనకు రాజస్థాన్ వెళ్లిన ఆయన జైపూర్లో గురువారం మీడియాతో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మహారాష్ట్రలో అతి త్వరలో మార్పు కనిపిస్తుంది. మార్చి నాటికి ప్రభుత్వంలో మార్పు వస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా లేదా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలి’ అని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్నారని, కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మాట్లాడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తమకు చెప్పారన్నారు. అయినప్పటికీ మూడు పార్టీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రలో ఎక్కువ కాలం మనుగడ సాగించదని రాణే అన్నారు.
రెండు వారాల కింద ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ వైద్యులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెన్నెముకకు సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆయన అనారోగ్యం నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని రాణే తెలిపారు.