న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరీ( Jayant Chaudhary )కి చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదించాడు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 19వ తేదీన ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆయన భద్రతను సమీక్షించారు. మంత్రి జయంత్ చౌదరీ తరపున తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే ఆ వ్యక్తిని గుర్తించనున్నట్లు వెల్లడించారు.