Delimitation | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ బాధ్యతను చూసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు. జనగణన- డీలిమిటేషన్ ఆధారిత మహిళా రిజర్వేషన్లను బిల్లులో ప్రతిపాదించడంతో జనగణన అనివార్యమైంది. జన గణన చేపట్టి.. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నది. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కొవిడ్ కారణంగా వాయిదా…
సాధారణంగా ప్రతి పదేండ్లకు జనగణన ఉంటుంది. 2011లో చివరిసారిగా జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సిన జనాభా లెక్కల కార్యక్రమం కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి జన గణన కార్యక్రమం నిర్వహించలేదు. మరోవైపు జనగణన జరగకపోవడంతో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగలేదు. తాజాగా తీసుకొచ్చిన మహిళా బిల్లును జనగణన- డీలిమిటేషన్కు లింకు చేయడంతో జనగణన తప్పనిసరి అయింది. 2024 అనంతరం రాబోయే ప్రభుత్వం జన గణనను చేపట్టనున్నది. అయితే ఈ కార్యక్రమం 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కొత్త జనాభా లెక్కల ప్రకారం 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తున్నది. అనంతరం కొత్త నియోజకవర్గాల ప్రకారం మహిళా రిజర్వేషన్లు కూడా అమలయ్యే చాన్స్ ఉంది.