Omicron alert | న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆఫ్రికాలో ఆ వేరియంట్ ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. భారత్లో కూడా ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా కొత్త వేరియంట్ గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే న్యూ వేరియంట్ ఒమిక్రాన్పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు.
కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖల్లో రాజేశ్ భూషణ్ కోరారు. కొవిడ్ నిబంధనలన కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని పేర్కొన్నారు.