ఢిల్లీ : పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అదేవిధంగా దేశంలో పామాయిల్ ఉత్పత్తిని పెంచే పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. “నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్” పేరుతో ఈ పథకాన్ని ఆమోదించింది. ఈ మిషన్ నిమిత్తం రూ. 11,040 కోట్లు వెచ్చించినట్లు, వచ్చే ఐదేళ్లలో దేశీయంగా పామాయిల్ సాగును మెరుగుపరచాలని చూస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో వెల్లడించారు.
2025-26 నాటికి పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు అదే 2029-2030 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. తినదగిన నూనెల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు చేయడం ముఖ్యమన్నారు.
పామ్ ఆయిల్ విత్తన మొలకలపై కేంద్రం రాయితీ ప్రకటించింది. ఆయిల్పామ్ సాగుకు హెక్టార్కు రూ.29 వేల సాయం అందించనుంది. దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకే సాయం అని పేర్కొంది. 15 హెక్టార్లలో సాగుకు రూ.కోటి వరకు సాయం అందించనుంది. ఆయిల్ పామ్ గిట్టుబాటు ధరలకు భరోసా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.