ముంబై: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని (IIT Bombay) కంప్యూటర్ ల్యాబ్కు గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టాడు. ఈ నేపథ్యంలో అందులోని కంప్యూటర్లు, ఏసీలు, ప్రాజెక్టర్, కుర్చీలు కాలిపోయాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్ ఈవ్ అయిన డిసెంబర్ 31న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో పొవాయ్లోని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ల్యాబ్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. కిరోసిన్ పోసి ల్యాబ్కు నిప్పంటించి పారిపోయాడు.
కాగా, పొగలు, మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేశాడు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రొఫెసర్ త్యాగరాజన్, కంప్యూటర్ ల్యాబ్ హెడ్ ఏహెచ్ ప్రదీప్ కూడా అక్కడకు చేరుకున్నారు. ల్యాబ్లోకి వెళ్లి పరిశీలించారు.
మరోవైపు గుర్తు తెలియని వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సంఘటనలో ఆరు కంప్యూటర్లు, రెండు ఏసీలు, ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, నాలుగు కుర్చీలు కాలి ధ్వంసమైనట్లు గమనించారు. సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.