న్యూఢిల్లీ: బంగాళా ఖాతంలోని దీవుల(Bay of Bengal Islands)పై ఓ గుర్తు తెలియని వస్తువు ఎగిరినట్లు తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల అమెరికాలో కొన్ని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్(Flying Object) కనిపించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా ఆ సమయంలో చైనా నిఘా బెలూన్ను కూల్చివేసింది. అయితే ఇండియాపై కూడా చైనా నజర్ పెట్టినట్లు ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇక 2022లో ఓ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్.. ఇండియాలోని స్ట్రాటజిక్ దీవుల సమీపం వద్ద ఎగిరినట్లు వార్తలు వ్యాపిస్తున్నాయి.
సింగపూర్కు సమీపంలో ఉన్న ఆ దీవుల సమూహంపై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను గుర్తించినట్లు రిపోర్టులో తెలిపారు. అమెరికా నేలకూల్చిన భారీ బెలూన్ తరహాలోనే ఆ ఆబ్జెక్ట్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఆ వస్తువు ఏంటో ఎవరికీ తెలియదు. అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న వందలాది మంది ప్రజలు ఆ బెలూన్ను తమ కెమరాల్లో బంధించినట్లు తెలుస్తోంది. ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను ఆశ్చర్యంతో షూట్ చేసినట్లు ఓ నివేదిక చెబుతోంది.
గుర్తు తెలియని వస్తువు దీవులపై ఎగురుగుతున్నట్లు గుర్తించిన తర్వాత ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ అలర్ట్ అయ్యింది. బంగాళాఖాతంలోని మలక్కా సంధి వద్ద ఉన్న మిస్సైల్ టెస్టింగ్ ప్రాంతానికి దగ్గరగా ఆ వస్తువు ఎగిరినట్లు తేల్చారు. అమెరికాలో చైనా బెలూన్ను కూల్చివేసిన ఘటన తర్వాత.. మరోసారి భారతీయ అధికారులు ఆ దీవులపై ఎగిరిన ఆ ఆబ్జెక్ట్ గురించి ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వస్తువులు కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు.
నిజానికి ఇండియన్ రాడార్లను దాటుకుని ఆ ఆబ్జెక్ట్ దీవులపైకి వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ రక్షణ అధికారులు దానిపై నిర్ణయం తీసుకునే లోపే ఆ వస్తువు దిశమార్చుకుని వెళ్లినట్లు గుర్తించారు.