న్యూఢిల్లీ: ఇవాళ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య చోటుచేసుకున్న రభసపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. ఎంసీడీలో బీజేపీ వ్యవహరించిన తీరు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఆర్ ప్రకారం.. నామినేటెడ్ సభ్యులకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదన్నారు. అయినా, ఇవాళ ఎంసీడీలో నామినేటెడ్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి మేయర్ ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారని కేజ్రివాల్ మండిపడ్డారు.
కాగా, ఇవాళ ఉదయం ఎంసీడీ కొలువుదీరగానే ప్రిసైడింగ్ అధికారిగా ఆప్ ప్రతిపాదించిన ముకేశ్ గోయెల్ను కాకుండా, మరో వ్యక్తిని ఎల్జీ నియమించారు. అనంతరం ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లను కాదని, ఎల్జీ నామినేట్ చేసిన కౌన్సిలర్లతో ముందుగా ప్రమాణస్వీకారం చేయించబోయారు. దాంతో ఆప్ కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది.