పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో దారుణం జరిగింది. అనారోగ్యం పాలైన కొడుకు వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో భరించలేకపోయిన ఓ తండ్రి అతని గొంతు పిసికి చంపేశాడు. గురవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుణె నగర శివార్లలో బాబూరావు డింకర్ జయ్భాయ్ అనే వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ముగ్గురు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం బాబూరావు కుమారుడు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. మంచంపై నుంచి కూడా లేవలేని స్థితికి చేరుకున్నాడు.
వైద్య ఖర్చులు, మెడిసిన్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఆ ఖర్చులకు భయపడిన బాబూరావు మానవత్వాన్ని మరిచి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో కన్న కొడుకనే కనికరం కూడా లేకుండా గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి విషయం తెలుసుకున్న భార్య విగతజీవిగా పడివున్న కొడుకును చూసి తల్లడిల్లింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.