UG NEET | న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తదితర వివరాల కోసం https://nta.ac.in/medicalexam అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.