ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సోమవారం జరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ నేతలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రేపై మండిపడ్డారు. ‘రాజకీయాల్లో దేనినైనా సహించవచ్చు. కానీ ద్రోహాన్ని కాదు. బీజేపీకి ద్రోహం చేసిన ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలి’ అని అమిత్ షా అన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించారు. బీజేపీకే కాకుండా సిద్ధాంతం, మహారాష్ట్ర ప్రజల తీర్పునకు ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారని ఆయన విమర్శించారు.
కాగా, ఉద్ధవ్ ఠాక్రేకు అధికారంపై దురాశ వల్లనే శివసేన చీలిందని అమిత్ షా ఆరోపించారు. ‘ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవిని ఎన్నడూ మేం వాగ్దానం చేయలేదు. ఈ రోజు నేను మళ్లీ ఈ విషయం చెబుతున్నా. మేం బహిరంగంగా రాజకీయాలు చేసే వ్యక్తులం. మూసి ఉన్న గదులలో కాదు’ అని ఆయన అన్నారు. రాజకీయాల్లో మోసం చేసేవారిని శిక్షించాల్సిందేనని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో 150 స్థానాలు గెలువడం ద్వారా దీనిని సాధించవచ్చని అన్నారు.