Uddhav Thackeray : మహారాష్ట్ర (Maharastra) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunala Kamra) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం మరింత ముదురుతోంది. షిండేను ‘ద్రోహి’గా కునాల్ అభివర్ణించాన్ని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సమర్ధించారు. ఆయనను ‘ద్రోహి’ అనడం తప్పేమీ కాదని అన్నారు.
కునాల్ కమ్రా తప్పేమీ మాట్లాడలేదని, ద్రోహి అనడమంటే ఒకరిపై దాడి చేయడం కాదని ఉద్ధవ్ థాకరే తెలిపారు. అంతేగాక కునాల్ పూర్తి పాట వినాలని, మిగతా వారికి కూడా వినిపించాలని ఆయన సూచించారు. కునాల్ కమ్రా షో జరిగిన హోటల్పై దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని చెప్పారు. అది ‘గద్దర్ సేన’ పని అని, ద్రోహం (గద్దర్) ఎవరి రక్తంలో ఉందో వాళ్లు ఎప్పుడూ శివసైనికులు కాలేరని వ్యాఖ్యానించారు.
ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామిడీ క్లబ్లో ఇటీవల కునాల్ కమ్రా షో జరిగింది. మహారాష్ట్ర రాజకీయాల గురించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివసేన నుంచి శివసేన బయటకు వచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందని అన్నారు. ఏక్నాథ్ షిండేను పరోక్షంగా ద్రోహిగా అభివర్ణిస్తూ.. ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయ కోణంలో మార్చి పాడారు.
అయితే కమ్రా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంను ద్రోహి అంటూ కామెడీ చేస్తారా..? ఇది కామెడీనా.. వల్గారిటీనా..? అంటూ శివసేన నేత షైనా ఎన్సీ మండిపడ్డారు. ఆ పార్టీ నేత ముర్జీ పటేల్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు కునాల్ షో సభావేదికను ధ్వంసం చేశారు.
వారిపై కామెడీ క్లబ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి పలువురు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివాదంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. ఏక్నాథ్ షిండేను ద్రోహి అనడం తప్పెలా అవుతుందని అంటూ కమెడియన్ కునాల్ కమ్రాను సమర్థించారు.