Fadnavis | కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లతో కూటమిని పునరుద్ధరించాలని 39 మంది శివసేన ఎమ్మెల్యేలు కోరుకోవట్లేదని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న ఫడ్నవీస్ నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ భగత్సింగ్ కోశియారితో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల సేపు ఆయనతో మాట్లాడారు. తర్వాత ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. 39 మంది శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్-ఎన్సీపీలతో కూటమి పునరుద్ధరణకు సిద్ధం లేరని తాము గవర్నర్కు లేఖ రాశామన్నారు. దీనర్థం వారు ప్రభుత్వంతో లేరన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సభా విశ్వాసం చూరగొనాలని సీఎంను ఆదేశించాలని ఫడ్నవీస్ కోరారు.
గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరిచి సభా విశ్వాసం పొందాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోశియారి ఆదేశించారు. కానీ, ఏక్నాథ్ షిండేతోపాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సంగతి తేలే వరకు సభా విశ్వాస పరీక్షకు అనుమతించొద్దని సుప్రీంకోర్టును ఠాక్రే వర్గం కోరింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడానికి నిరాకరించింది.
ఇదిలా ఉంటే, ముంబైకి తిరిగి రాగానే రెబెల్ ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరుతున్నారు. గురువారం రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకి రానున్నారని తెలుస్తున్నది. `మీకు నేనొక అప్పీల్ చేయదలుచుకున్నా.. సమయం మించి పోలేదు. మీరు వచ్చి నాతో సమావేశమై సందేహాలు తీర్చుకున్నాక పరిష్కారం కనుగొందాం` అంటూ రెబెల్ ఎమ్మెల్యేలకు సీఎం ఠాక్రే లేఖలు రాశారు.